ఇండియా కూటమి అధికారంలోకి వస్తే వక్ఫ్ సవరణ చట్టాన్ని చెత్త బుట్టలో పడేస్తాం : ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్


బీహార్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కతిహార్, కిషన్‌గంజ్ జిల్లాల్లో ఆదివారం నిర్వహించిన ర్యాలీల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ  ఇండియా కూటమి అధికారంలోకి వస్తే వక్ఫ్ సవరణ చట్టాన్ని చెత్త బుట్టలో పడేస్తామన్నారు. గతంలో లాలూ, రబ్రీ పరిపాలన ఆర్ఎస్ఎస్, మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా దృఢంగా నిలిచిందన్నారు. కానీ దేశవ్యాప్తంగా మత విధ్వేషాలను రెచ్చగొట్టే ఆ శక్తులకు సీఎం నితీశ్ మద్దతిస్తున్నారని విమర్శించారు. రెండు దశాబ్దాల నితీశ్ ప్రభుత్వం సీమాంచల్‌ను అభివృద్ధి చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, శాంతిభద్రతలు కుప్పకూలిపోయాయని ఆరోపించారు. బీజేపీ జాతీయ నాయకుల బెదిరింపులకు తాను భయపడబోనని స్పష్టం చేశారు. తాము నిజమైన బిహారీలమని బయటివారికి ఎదురు నిలుస్తాయని తేల్చి చెప్పారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పంచాయతీల్లో పని చేసే సిబ్బంది వేతనాలు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. వారికి రూ.50లక్షల బీమా సౌకర్యంతో పాటు పెన్షన్ కూడా ఇస్తామని తెలిపారు. అలాగే కుండలు, కమ్మరి, వడ్రంగి వంటి వృత్తులు చేసేవారికి రూ. 5 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తామని ప్రకటించారు. 'బీహార్ మార్పు కోసం ఆసక్తిగా ఉంది. ప్రస్తుత ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు. ప్రజలు మార్పు తీసుకొస్తారు. ఎన్డీయేకు 20 ఏళ్లు ఇచ్చారు. మాకు 20 నెలలు మాత్రమే కావాలి. బీహార్‌ను నంబర్ 1 రాష్ట్రంగా మార్చడానికి కృషి చేస్తాం' అని వ్యాఖ్యానించారు. 

Post a Comment

0 Comments