కాన్ బెర్రా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఆటను తిరిగి ప్రారంభించడానికి అవకాశం లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ఎప్పటిలాగే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత ఇనింగ్స్ లో అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ బ్యాటింగ్ను ప్రారంభించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (19) మరోసారి బ్యాట్ ఝళిపించి కొన్ని ఫోర్లు కొట్టినా 35 పరుగుల వద్ద నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో టిమ్ డేవిడ్కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. భారత 5 ఓవర్లకు స్కోర్ 43/1 వద్ద ఉండగా తొలిసారిగా వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. వర్షం తగ్గిన తర్వాత మ్యాచ్ను 18 ఓవర్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 5.2 ఓవర్లకు పవర్ప్లే కుదించబడింది. ఆట తిరిగి ప్రారంభం కాగానే, గిల్ మరియు సూర్యకుమార్ జోరు పెంచారు. ఈ నేపథ్యంలో 8వ ఓవర్లో 18 పరుగుల వద్ద ఉన్న సూర్యకుమార్ యాదవ్కు జోష్ ఫిలిప్ క్యాచ్ డ్రాప్ చేయడంతో ఒక లైఫ్ లభించింది. ఈ నేపథ్యంలో గిల్ (37), సూర్యకుమార్ యాదవ్ (39) కలిసి కేవలం 32 బంతుల్లో అర్ధశతక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. భారత్ స్కోర్ 9.4 ఓవర్లకు 97/1గా ఉన్నప్పుడు రెండోసారి వర్షం అంతరాయం కలిగించింది. అయితే ఈసారి వర్షం తగ్గకపోవడం, ఆటను కొనసాగించే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
0 Comments