మేడ్చల్ లోని కండ్లకోయ సీఎంఆర్ కాలేజీ లేడీస్ హాస్టల్ బాత్ రూమ్ లో విద్యార్థినుల నగ్న వీడియోలు చిత్రీకరణ ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. విద్యార్థినులు రోడ్డెక్కడంతో ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసు విచారణలో పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. ఇందులో భాగంగానే బుధవారం కుకింగ్ డిపార్ట్మెంట్లోని ఐదు గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తాజాగా ఇవాళ మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సీఎంఆర్ హాస్టల్ మెస్ ఇన్ చార్జి సెల్వం, హాస్టల్ వార్డెన్ ప్రీతి రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారిద్దరిని విచారిస్తున్నారు. బాత్ రూమ్ లో వీడియోలు తీస్తున్నారంటూ కంప్లైంట్ చేసిన వార్డెన్ ప్రీతి రెడ్డి పట్టించుకోకుండా ఇంకా పై నుండి తమనే దూషించిందని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వార్డెన్ ప్రీతిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సీఎంఆర్ కాలేజీ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు సైబరాబాద్ కమిషనర్కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. సీఎంఆర్ కాలేజ్ ఘటనపై తక్షణమే నివేదిక సమర్పించాలని సీపీని ఆదేశించింది.
0 Comments