ఆంధ్రప్రదేశ్ లో అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ పిఠాపురం (పిఠాపురం ప్రాంత అభివృద్ధి సంస్థ)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ముందుగా పిఠాపురం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (పాడా)గా ఏర్పాటు చేద్దామనుకున్నారు. తర్వాత పేరు మార్చారు. దీనికి ఇటీవలే కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పిఠాపురంలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. సీనియర్ ఆర్డీవోను పనులు పర్యవేక్షించేలా ప్రాజెక్ట్ డైరెక్టర్ గా నియమిస్తారు. పిఠాపురంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక అభివృద్ధి, పేదరిక నిర్మూలనకు ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేస్తారు. ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా నిర్ణయాలు తీసుకుంటారు. కేబినెట్ ఆమోదం తెలిపిన దాని ప్రకారం పిఠాపురం పట్టణంలో ఉన్న 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తారు. దీనికి దాదాపు రూ.39 కోట్లు ఖర్చుచేయనున్నారు. దీనివల్ల పిఠాపురం పరిధిలోని ఎనిమిది మండలాల ప్రజలకు వైద్యసేవలు అందుతాయి. ప్రస్తుతం ఇక్కడ 20 మంది ఉద్యోగులు ఉండగా కొత్తగా 66 పోస్టులు రాబోతున్నాయి. పిఠాపురంలో ఆర్టీసీ బస్టాండ్ ను అభివృద్ధి చేయడంతోపాటు రోడ్ల మరమ్మతులకు రూ.3 కోట్లు, గ్రామీణ ప్రాంతాల రోడ్లకు రూ.10 కోట్లు కేటాయించారు. అలాగే రామ్ చరణ్ - ఉపాసన దంపతులు కూడా పిఠాపురంలో కొంత భూమిని కొనుగోలు చేశారు. ఇందులో అపోలో ఆసుపత్రిని నిర్మించబోతున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు, పవన్ కల్యాణ్ కు మంచిపేరు వచ్చేలా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నారు.

Post a Comment

أحدث أقدم