ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటనను పరిశీలిస్తే ఐడీఎఫ్ దళాల గురి ఇరాన్ టాప్ లీడర్ ఖమేనీపై ఉన్నట్లు తెలుస్తోంది. నిరంకుశ పాలనను అంతం చేస్తామంటూ మొన్న ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. ఆ మర్నాడే.. ఇరాన్ క్షిపణుల దాడి చేసింది. దీనికి స్పందనగా నెతన్యాహు ''ఇరాన్ పాలకులు మా ఆత్మరక్షణ శక్తిని, మా శత్రువులపై ప్రతిదాడి చేసే సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేశారు. సిన్వార్, డెయిఫ్ ఇలానే అర్థం చేసుకోలేదు. నస్రల్లా, షుక్ర్ కూడా అలాగే వ్యవహరించారు. ఇప్పుడు ఇరాన్ కూడా ఇలానే చేస్తోంది. వారు అర్థం చేసుకొంటారు. మాపై ఎవరు దాడి చేశారో వారిపై మేం దాడి చేస్తాం'' అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు ఇరాన్ నాయకత్వం ఇజ్రాయెల్ రాడార్లోకి వచ్చిందని బలమైన సంకేతాలు వెళ్లాయి. ఇజ్రాయెల్ సైనికాధికారులు జెరూసలెం పోస్టుతో మాట్లాడుతూ తమ దేశ ప్రతిస్పందన వ్యూహాత్మకంగా, వేగంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. టెల్అవీవ్పై దాడుల వెనకే కాదు.. ఈ ప్రాంతాన్ని అస్థిరపర్చడం వెనక కూడా ఇరాన్ సుప్రీం లీడరున్నారన్న అభిప్రాయం వ్యక్తంచేశారు. అదే సమయంలో అణు సామర్థ్యాన్ని కూడా ధ్వంసం చేయాలని పేర్కొన్నారు. ఇరాన్ను ఆర్థికంగా కుంగదీసేలా ఇజ్రాయెల్ లక్ష్యాలు ఉంటాయని సైనిక నిపుణులు భావిస్తున్నారు. చమురు, గ్యాస్, కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్ వంటివి తమ లక్ష్యాలుగా మారతాయని ఐడీఎఫ్ అధికారి ఒకరు పేర్కొన్నారు. దీంతోపాటు ఆ టెహ్రాన్ యుద్ధ విమానాలు, క్షిపణి తయారీ కేంద్రాలను కూడా తాము ధ్వంసం చేయొచ్చని చెప్పారు.
إرسال تعليق