ఇజ్రాయెల్పై నిఘా కోసం ఏర్పాటుచేసిన ఓ ఇంటెలిజెన్స్ అధిపతే చివరికి తమను మోసం చేశాడని ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహముద్ అహ్మదిన్జాద్ వాపోయారు. అతడు తమ సమాచారం ఇజ్రాయెల్కు చేరవేసేవాడని ఆరోపించారు. టెహ్రాన్లో మొస్సాద్ సంస్థ ఏ స్థాయిలో వేళ్లూనుకుందో వెల్లడిస్తూ ఈవిషయాన్ని సీఎన్ఎన్ తుర్క్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మొస్సాద్ విజయవంతంగా మా ఇంటెలిజెన్స్ యూనిట్స్ను తన వైపునకు తిప్పుకొందన్నారు. వీరిలో సీనియర్ అధికారులు కూడా ఉన్నట్లు చెప్పారు. దాదాపు 20 మంది ఇంటెలిజెన్స్ సిబ్బంది డబుల్ ఏజెంట్లుగా మారిపోయి ఇజ్రాయెల్కు అత్యంత కీలకమైన అణు రహస్యాలను చేరవేశారన్నారు. ఈ వ్యాఖ్యలతో ఇరాన్ భద్రత, నిఘా వ్యవస్థలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మా నిఘా సంస్థకు చెందిన ఓ అధిపతే ఇజ్రాయెల్ గూఢచారని 2021లో బయటపడిందన్నారు. ఇరాన్లో టెల్అవీవ్ అత్యంత కఠిన ఆపరేషన్లు నిర్వహించి తేలిగ్గా కీలక సమాచారం చేజిక్కించుకొంటుందని చెప్పారు. ఇటీవల కాలంలో మొస్సాద్ కార్యకలాపాలు మరింత పెరిగిపోయాయని చెప్పారు. మొస్సాద్ ఓ ఆపరేషన్ చేసి దాదాపు 1,00,000 అణుపత్రాలను అపహరించింది. వాటిని ఇజ్రాయెల్ ప్రధాని 2018లో బహిర్గతం చేశారు. ఇరాన్ ఏవిధంగా సీక్రెట్గా అణు కార్యక్రమాలు నిర్వహిస్తోందో.. వాటిలో స్పష్టంగా ఉన్నాయి. టెహ్రాన్లోని రహస్య స్థావరంలోకి మొస్సాద్ ఏజెంట్లు చొరబడి వీటిని దక్కించుకొన్నారు. దాదాపు పాతిక మంది ఇందులో పాల్గొన్నట్లు సమాచారం. ఇరాన్ అణు లక్ష్యాలను ఇది తీవ్రంగా దెబ్బతీసింది.
0 Comments