తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాంపల్లికోర్టు నోటీసులు జారీ చేసింది. తన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాంటూ ఈనెల 8న కోర్టును కోరారు నాగార్జున. అలాగే వాంగ్మూలం కూడా ఇచ్చారు. సాక్షిగా సుప్రియ వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసుకుంది. ఆపై ఈరోజుకు విచారణను వాయిదా వేసింది. ఈ పిటిషన్పై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు ఈరోజు మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 23కు నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. వాంగ్మూలంలో మంత్రిపై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ''సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్ఠలున్నాయి. దేశ వ్యాప్తంగా మా కుటుంబం పట్ల ఆధారాభిమానాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి. సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మా కుమారుడు విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్ కారణం అని మంత్రి అసభ్యంగా మాట్లాడారు. అలా మాట్లాడం వల్ల మా పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లింది. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు అన్ని అసత్య ఆరోపణలు. రాజకీయ దురుద్దేశంతో మంత్రి ఇలాంటి వాఖ్యలు చేశారు. ఎంతో పేరు ప్రతిష్ఠలు ఉన్న తన కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైంది. మంత్రి మాట్లాడిన మాటలు అన్ని టెలివిజన్ ఛానెల్స్లో ప్రసారం చేశాయి. అన్ని పేపర్స్ ప్రచురితం చేశాయి. దీని వల్ల మా కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. దేశ వ్యాప్తంగా మా కుటుంబంపై తీవ్ర ప్రభావం పడింది. ఇలా మంత్రి చేసిన వ్యాఖ్యల వల్ల మా కుటుంబానికి నష్టం జరిగింది. మా కుటుంబం మానసిక క్షోభకు గురైంది'' అంటూ కోర్టుకు నాగార్జున స్టేట్మెంట్ ఇచ్చారు.
0 Comments