మహారాష్ట్రలోని అమరావతికి సమీపంలో మేలేఘాట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలోకి పడి నలుగురు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలపాలయ్యారు. అమరావతికి అత్యంత సమీపంలో ఉన్న మేలేఘాట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు ప్రయాణికులతో అమరావతి నుంచి ధరణి వైపు వెళ్తోంది. ఉదయం 8-30 గంటల ప్రాంతంలో సేమడోహ్ సమీపంలోని భూత్ఖోరా ప్రాంతంలో ప్రమాదకరమైన వంపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి లోయలోకి పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా 30 మందికిపైగా గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను హుటాహుటిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
0 Comments