కర్ణాటకలో ప్రీమియం లిక్కర్ ధరలు నేటి నుంచి భారీగా తగ్గనున్నాయి. ఏకంగా 25 శాతం రేటు తగ్గింపుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని వల్ల మద్యం రేటు భారీగా దిగి రానుంది. దీని వల్ల రాష్ట్ర ప్రజలు స్థానికంగా దొరికే మద్యాన్నే కొనుగోలు చేస్తారు. ఫలితంగా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. వాస్తవంగా అయితే ఈ మద్యం ధరల తగ్గింపు నిర్ణయం జూలై 1, 2024 నుంచే అమల్లోకి రావాల్సి ఉంది. కానీ విపక్షాల ఆందోళన నేపథ్యంలో అది వాయిదా పడుతూ వస్తోంది. చివరకు నేటి నుంచి అమల్లోకి రానుంది. కర్ణాటక వైన్ మర్చంట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్.. కరుణాకర్ హెగ్డే మాట్లాడుతూ ''రాష్ట్రంలో చాలా రోజుల నుంచి ప్రీమియం లిక్కర్ ఉత్పత్తి ఆగిపోయింది. రేట్లు తగ్గిస్తారనే భయంతో చాలా డిస్టిల్లరీస్ ఉత్పత్తిని ఆపేశాయి. ఎందుకంటే అధిక ధర వద్ద ఉత్పత్తి చేసి తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు రేటు తగ్గించి అమ్మాల్సి వస్తుంది.. అప్పుడు నష్టాలు చవి చూస్తామనే భయంతో చాలా మంది డిస్టిల్లరీస్ ప్రీమియం లిక్కర్ ఉత్పత్తిని ఆపేశారు. అలానే రిటైలర్స్ కూడా ప్రీమియం లిక్కర్ని నిల్వ ఉంచడం లేదు. కారణం ప్రభుత్వం ప్రీమియం లిక్కర్ రేటును తగ్గిస్తుందని వార్తలు రావడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాయి'' అని చెప్పుకొచ్చాడు. గతంలో కర్ణాటకలో ప్రీమియం లిక్కర్ అనగా బ్రాందీ, విస్కీ, జిన్, రమ్ వంటి వాటి రేట్లు భారీగా పెరిగాయి. దాంతో మద్యం ప్రియులు స్థానికంగా దొరికే లిక్కర్ని కాకుండా పక్క రాష్ట్రాల మద్యాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించారు. దీని వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లింది. దీనికి అడ్డుకట్ట వేయడం కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రీమియం లిక్కర్ రేట్లను సుమారు 25 శాతం వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల స్థానికులు లోకల్ బ్రాండ్లనే కొంటారు. అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ఇలాంటి నిర్ణయం తీసుకుంది.
إرسال تعليق