మౌంట్ క్యాంగ్‌పై సీఎం రేవంత్ ఫొటోలు పెట్టిన మౌంటేనీర్ భూక్యా యశ్వంత్ !


తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో మారుమూలన ఉన్న ఉల్లేపల్లి భూక్యా తండాకు చెందిన గిరిజన యువకుడు, మౌంటేనీర్ భూక్యా యశ్వంత్ 6,250 మీటర్ల ఎత్తయిన మౌంట్‌ క్యాంగ్‌ యాట్సీ-2 అధిరోహించి భారత త్రివర్ణ పతాకాన్నిశిఖరంపై నిలబెట్టారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోలను ప్రదర్శించారు. ఈ విషయంపై యశ్వంత్‌ సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. పర్వత అదిరోహణలో ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించిన యశ్వంత్ ఇప్పుడు హిమాలయాల్లో లడఖ్ ప్రాంతంలో ఉన్న 6250 ఎత్తయిన శిఖరాన్ని అధిరోహించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటికే దక్షిణాఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో, యూరప్‌లోని మౌంట్ ఎలబ్రస్, అస్ట్రేలియాలోని మౌంట్ కొస్క్లాస్కో, హిమాచల్‌లోని మౌంట్ యూనమ్, మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించి దూసుకెళ్తున్న యశ్వంత్ ఈసారి మరింత ఎత్తయిన శిఖరాన్ని లక్ష్యంగా ఎంచుకున్నాడు. గత నెలలోనే యశ్వంత్ ఆసక్తిని, ప్రతిభను గుర్తించిన ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. మౌంట్ క్యాంగ్‌ను విజయవంతంగా అధిరోహించిన యశ్వంత్ అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగరేయటంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోలను ప్రదర్శించి తన కృతజ్ఞతను చాటుకున్నారు. తన ఆనందం, విజయంలో సీఎం రేవంత్ అందించిన సహకారం మరిచిపోలేనిదని గుర్తు చేసుకున్నాడు. సీఎం రేవంత్ నాయకత్వ పటిమ, దూరదృష్టి, కృషి, ప్రజల పట్ల చూపించే శ్రద్ధ ఎంతో స్ఫూర్తిని అందించాయని తెలిపారు. తనపై ఉంచిన నమ్మకం, ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రోత్సాహం ఈ విజయానికి దోహదపడిందని యశ్వంత్ లేఖలో పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments