కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులు ఇందిరా గాంధీ హత్యకు సంబంధించిన పోస్టర్లు అతికించడం కలకలకలం రేపింది. ఈ చర్యలను కెనడా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హింసను ప్రోత్సహించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. దీనిపై ఎక్స్ వేదికగా కెనడా మంత్రి డామినిక్ ఏ లెబ్లాంక్ స్పందించారు. 'వాంకూవర్లో కొందరు ఇందిరా గాంధీ హత్య పోస్టర్లు వేశారు. కెనడాలో ఈ విధంగా హింసను ప్రోత్సహించడం ఆమోదయోగ్యం కాదు' అని పేర్కొన్నారు. దీనికి ముందు కెనడాలోని వాంకోవర్లో ఖలిస్థానీ మద్దతుదారులు ఇందిరా గాంధీ హత్యపై వివాదాస్పద పోస్టర్లు అతికించడాన్ని హిందూ-కెనడియన్ ఎంపీ, మంత్రి చంద్ర ఆర్య తీవ్రంగా తప్పుపట్టారు. కెనడాలో హింసను ప్రోత్సహించడాన్ని ఎన్నటికీ అంగీకరించబోమని స్పష్టం చేశారు. వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ట్రూడో ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పార్టీకి చెందిన ఎంపీ ఆర్య ట్విట్టర్ వేదికగా.. 'భారత ప్రధాని ఇందిరా గాంధీ శరీరంపై బుల్లెట్ రంధ్రాలు ఉన్నాయని, ఆమె అంగరక్షకులే తుపాకులు పట్టుకుని హంతకులుగా మారారని పేర్కొంటూ ఖలిస్థానీ మద్దతుదారులు పోస్టర్లు వేసి, మరోమారు హిందూ-కెనడియన్లలో భయం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇది కొన్ని సంవత్సరాల క్రితం బ్రాంప్టన్లో జరిగిన బెదిరింపుల కొనసాగింపని, కెనడాలోని హిందువులను భారతదేశానికి తిరిగి వెళ్లాలని కోరుతున్న ఖలిస్థానీ ఉద్యమ నేత పన్నూన్ చర్య అని పేర్కొన్నారు. ఆయన ప్రత్యేక సిక్కు రాష్ట్ర ఉద్యమాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ విధమైన చర్యలకు పాల్పడతున్నారన్నారు. పన్నూన్పై కెనడాలోని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్య డిమాండ్ చేశారు. ఇటీవల వాంకోవర్లో భారత ప్రధాని ఇందిరా గాంధీ హత్యను చిత్రీకరించే పోస్టర్లు వెలిశాయని పబ్లిక్ సేఫ్టీ, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్, ఇంటర్ గవర్నమెంటల్ అఫైర్స్ మంత్రి డొమినిక్ ఎ లెబ్లాంక్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. హింసను ప్రోత్సహించడం ఎన్నటికీ ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. కాగా హౌస్ ఆఫ్ కామన్స్ ఆఫ్ కెనడాలో నేపియన్ ఎన్నికల జిల్లాకు చంద్ర ఆర్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
0 Comments