తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను చూడటానికి వచ్చే వీక్షకులతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. తెలంగాణ పదేళ్ల సంబరాలను చూడటానికి ప్రజలు భారీగా వస్తున్నారు. ఓ వైపు నగరంలో వర్షం పడుతున్నా కూడా వేడుకలను తిలకించేందుకు ప్రజలు అత్యధికంగా వస్తుండటంతో ట్యాంక్బండ్ పరిసరాలు జనాలతో కిటకిటలాడుతున్నాయి. వీక్షకుల కోసం ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. తెలంగాణ కళారూపాలను కళాకారులు ప్రదర్శిస్తున్నారు. సాయంత్రం 6:30 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కార్నివాల్, లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ వద్ద భారీ వర్షం పడుతోంది. భారీ వర్షంలో సైతం సంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వర్షంలో తడుస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వీక్షిస్తున్నారు. 8:50 నిమిషాల నుంచి పది నిమిషాల పాటు ట్యాంక్ బండ్ పై ఫైర్ వర్క్స్ ప్రదర్శించనున్నారు. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేశారు. ట్యాంక్బండ్ వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సందర్శించనున్నారు. తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహించ నున్నారు.కార్నివాల్లో 700 మంది కళాకారులు పాల్గొననున్నారు. వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ప్రదర్శించనున్నారు. స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్పై ఇటు చివర నుంచి అటు చివరి వారకు భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహించనున్నారు. ఫ్లాగ్ వాక్లో 5 వేల మంది పాల్గొననున్నారు. ఫ్లాగ్వాక్ జరుగుతున్నంత సేపు జయ జయహే తెలంగాణ ఫుల్వర్షన్ గీతం విడుదల చేయనున్నారు. ఈ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అందెశ్రీ, సంగీత, కీరవాణికి సన్మానం చేయనున్నారు. కార్యక్రమ ముగింపుగా పది నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా ఫైర్ వర్క్స్ ఏర్పాట్లు చేశారు.
0 Comments