ఉత్తరప్రదేశ్లోని తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసికి 18న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్లనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అక్కడ ఆయన 'కిసాన్ సమ్మేళన్' (రైతుల సదస్సు)లో పాల్గొనే అవకాశం ఉందని తెలిపాయి. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోడీ వారణాసికి వెళ్లడం ఇదే తొలిసారి. వారణాసిలోని రోహానియా లేదా సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గంలో రైతుల సదస్సు నిర్వహించే అవకాశం ఉన్నట్లు స్థానిక భాజపా నేతలు తెలిపారు. వేదిక ఏర్పాటుకు స్థలం ఎంపిక జరుగుతోందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ వారణాసి పర్యటనకు సంబంధించి ఏర్పాట్ల కోసం గులాబ్ బాగ్లోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధికారుల సమావేశం జరిగిందన్నారు. కాశీ ప్రాంతానికి భాజపా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న దిలీప్ పటేల్ మాట్లాడుతూ టెంపుల్ టౌన్లో ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దశాశ్వమేధ ఘాట్లో గంగా హారతిలో పాల్గొంటారని తెలిపారు. అందుకు తగిన సన్నాహాలు ప్రారంభించామన్నారు. వారణాసిలో ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధం కావాలని భాజపా కార్యకర్తలను కోరామన్నారు.
0 Comments