విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకులు మరియు దౌర్జన్యకర చర్యలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. జాతీయ వార్తాపత్రిక ‘ది హిందూ’లో రాసిన వ్యాసంలో ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న కృత్రిమ ప్రతిష్ఠ ఈ దౌర్జన్యంతో పూర్తిగా దెబ్బతిన్నదని, దానిని ఇకపై ఎంత డబ్బు వెచ్చించినా పునర్నిర్మించలేరని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా వివిధ వర్గాలు, ప్రాంతాల నుంచి వచ్చిన యువత తమ రాజ్యాంగ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చారని రాహుల్ పేర్కొన్నారు. విద్యార్థుల ప్రాథమిక నిరసన హక్కులను నొక్కేసేందుకు హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పోలీసు బలగాలు అమానుషంగా వ్యవహరించాయని ఆరోపించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా లేదా ఏ ఇతర అధికారైనా తమ చర్యల పర్యవసానాలు మరియు బాధ్యతల నుంచి తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు. ఈ నిరసనల సమయంలో శాంతియుత విద్యార్థులపై పెల్లెట్ గన్స్, కన్నీటి వాయుగోళాలు మరియు లాఠీలను ఉపయోగించారని, ఒక విద్యార్థి చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని రాహుల్ ఆరోపించారు. హోం మంత్రిగా అమిత్ షా ఈ దాడులకు స్వయంగా ఆదేశాలు ఇచ్చి ఉండాలి. లేదా తన పరిధిలోని పోలీసుల చర్యలపై ఆయనకు అవగాహన ఉండకపోవాలి. ఈ రెండింటిలో ఏది నిజమైనా అమిత్ షా హోం మంత్రి పదవికి పనికిరారని, ఆయన ఉనికిలోనే అపారమైన అసమర్థత లేదా నేరపూరిత నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ ఘటనపై స్వతంత్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
అమిత్ షా రాజీనామా చేయాల్సిందే : లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق