విడాకుల కేసు విచారణలో ఉండగా నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా తన కుమార్తె, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌ వేధింపులు, పరువునష్టం కలిగించే పోస్టులు పెడుతున్నారని ఓ వృద్ధుడు చేసిన ఫిర్యాదుపై సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మణికొండకు చెందిన బాధితుడు (రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి) కుమార్తె అమెరికాలోని డెన్వర్‌, కొలరాడోలో ఇద్దరు చిన్నారులతో నివసిస్తోంది. 2025 మార్చి లో ఆమె భర్త అమెరికాలో విడాకుల పిటిషన్‌ దాఖలు చేయగా ప్రస్తుతం ఆ కేసు అక్కడి కోర్టులో పెండింగ్‌లో ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తన కుమార్తె భర్త, అతడి కుటుంబ సభ్యులు వివాహ వివాదంలో జోక్యం చేసుకుంటూ ఆమెను మానసికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 2026 జనవరి నుంచి నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా తన కుమార్తెపై తప్పుడు, పరువునష్టం కలిగించే ఆరోపణలు చేస్తూ, ఆమె స్నేహితులకు కూడా అవే సందేశాలు పంపుతున్నారని ఫిర్యాదులో వెల్లడించారడు. విడాకుల కేసుపై ఒత్తిడి తీసుకురావడం, కుటుంబాన్ని మానసికంగా వేధించడమే ఈ ప్రచారం వెనుక ఉద్దేశమని ఆరోపించారు. సంబంధిత సందేశాలు, స్క్రీన్‌షాట్లు, చాట్‌ రికార్డులు తదితర ఆధారాలను ఫిర్యాదుతో పాటు అందజేసినట్లు తెలిపారు. 'రిష్‌.ఐరాక్‌26' పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా, ఫేస్‌బుక్‌ పోస్టులను సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు కేసునమోదు చేసి, సంబంధిత సోషల్‌ మీడియా ఖాతాల సాంకేతిక వివరాలు, డిజిటల్‌ ఆధారాలు, పోస్టుల మూలాన్ని గుర్తించే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment

أحدث أقدم