ఆంధ్రప్రదేశ్ లో మిశ్రమ వాతావరణ పరిస్ధితులు కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలు, మరికొన్ని జిల్లాలో వడగాల్పులు దంచికొడుతున్నాయి. రేపు కూడా దాదాపు ఇలాంటి వాతావరణమే ఉంటుందని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరిందని వాతావరణ విభాగం తెలిపింది. ఇవాళ ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదయ్యాయి. శనివారం వరకు ఈ తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరింది. వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. అత్యవసర ప్రయాణాల్లో తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకుని వెళ్లాలన్నారు. ఇవాళ కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరులో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 48.1 డిగ్రీలు నమోదయ్యాయి. రేపు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో 45 - 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 - 44 డీగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 - 42 డీగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
إرسال تعليق