తెలంగాణ అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత హాజరైన విషయం తెలిసిందే. అయితే అందరూ ఉహించినట్లుగాను మాజీ సీఎం కేసీఆర్ సభలో కొన్ని క్షణాల పాటు మాత్రమే ఉండి వెళ్లిపోయారు. దీనిపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ కేసీఆర్ సభకు వచ్చింది ప్రజా సమస్యల కోసం కాదని, కేవలం తన నెల జీతం తీసుకోవడానికి, ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి వస్తున్నారంటూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా హైప్ ఇచ్చాయని, తీరా చూస్తే కేసీఆర్ రెండు నిమిషాలు కూడా సభలో ఉండకుండానే వెళ్లిపోయారని విమర్శించారు. దళితుల పట్ల కేసీఆర్కు ఉన్న వివక్ష ఈ పర్యటనతో మరోసారి బయటపడిందని బీర్ల ఐలయ్య ఆరోపించారు. సభలో దళిత స్పీకర్ను "అధ్యక్షా" అని సంబోధించాల్సి వస్తుందనే భయంతోనే కేసీఆర్ మైక్ అడగకుండానే వెనుదిరిగారని వ్యాఖ్యానించారు. దళితులపై కేసీఆర్కు ఎంత ప్రేమ ఉందో ఈ తీరును బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. సభలో చర్చలకు దూరంగా ఉండి కేవలం ఫార్మాలిటీ కోసమే వచ్చి వెళ్లడం బాధ్యతారాహిత్యమని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దుయ్యబట్టారు.
కేసీఆర్ అసెంబ్లీకి ఫార్మాలిటీ కోసమే వచ్చి వెళ్లడం బాధ్యతారాహిత్యం !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق