తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని అక్షయ పాత్ర పౌండేషన్ ప్రతినిధులు ఇవాళ కలిసి నవంబరు 14వ తేదీన కొడంగల్‌లో నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ముందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ వచ్చింది.  మధ్యాహ్న భోజనం తయారు చేసేందుకు కొడంగల్ సమీపంలోని ఎన్కేపల్లిలో రెండెకరాల విస్తీర్ణంలో గ్రీన్ ఫీల్డ్ కిచెన్ అక్షయ పాత్ర ఫౌండేషన్  నిర్మించనుంది. గ్రీన్ ఫీల్డ్ కిచెన్‌లో వండిన భోజనాన్ని నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలకు సరఫరా చేయనుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనానికి ఒక్కో విద్యార్థికి రూ.7 చొప్పున చెల్లిస్తోంది ప్రభుత్వం. అయితే, నాణ్యమైన భోజనం అందించేందుకు అక్షయ ఫౌండేషన్ దాదాపు రూ.25లు ఖర్చు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చెల్లించే నిధులకు అదనంగా అయ్యే ఖర్చును అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు భరించనున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధుల సాయంతో ఈ పథకం అమలుకు అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో పిల్లలకు బ్రేక్‌పాస్ట్ అందించే పథకం విజయవంతంగా అమలవుతుంది. 312 పాఠశాలల్లో దాదాపు 28 వేల మంది విద్యార్థులకు ప్రతి రోజూ ఉదయాన్నే అల్పాహారం అందిస్తున్నారు. అన్ని గ్రామాల్లో పిల్లలు, తల్లిదండ్రుల నుంచి ఈ పథకానికి అపూర్వ స్పందన వచ్చిందని, ఈ పథకం దేశంలోనే అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.

Post a Comment

أحدث أقدم