మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం నిర్మించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. రాజ్‌ఘాట్, రాష్ట్రీయ స్మృతి స్థల్‌తో పాటు కిసాన్ ఘాట్ సమీపంలో 1 నుంచి 1.5 ఎకరాల స్థలంలో స్మారక చిహ్నం కోసం ప్రతిపాదించినట్టు సమాచారం. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు ఈ ప్రాంతాలను ఇప్పటికే పరిశీలించారు. ఈ రెండు స్థలాల్లో ఒక స్థలాన్ని ఎంచుకోవాలని మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు అధికారులు సూచించినట్టు తెలుస్తోంది. కొత్త విధానం ప్రకారం, మెమోరియల్ కోసం స్థలాన్ని ట్రస్టుకు మాత్రమే కేటాయించాల్సి ఉంటుంది. ఆ కారణంగా ప్రాజెక్టు ప్రారంభించడానికి ముందు ట్రస్టు ఏర్పాటు కావాలి. ట్రస్టు ఏర్పాటయిన వెంటనే భూమి కేటాయింపు కోసం దరఖాస్తు చేసుకోవాలి. నిర్మాణం కోసం సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌తో ఎంఓయూపై సంతకం చేయాలి. కాగా, మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ స్మారకాలు ఉన్న రాజ్‌ఘాట్‌కి సమీపంలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మన్మోహన్ సింగ్ మరణానంతరం స్మారక చిహ్నం నిర్మాణంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. స్మారక చిహ్నం కేటాయించే చోటులోనే అంత్యక్రియలు జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా, ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని బీజేపీ తిప్పికొట్టింది.

Post a Comment

أحدث أقدم