సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై అత్యధిక సార్లు అయిదు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బుమ్రా 5 వికెట్స్ తీసి ఈ ఘనత అందుకున్నాడు. సేనా దేశాలపై బుమ్రా ఏడు సార్లు ఫైఫర్ పడగొట్టాడు. భారత దిగ్గజం కపిల్ దేవ్ కూడా ఆ దేశాలపై ఏడు సార్లు అయిదు వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా 51 ఇన్నింగ్స్‌ల్లో ఏడు సార్లు ఫైఫర్ పడగొడితే, కపిల్ దేవ్ 62 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. నాటింగ్‌హమ్, కేప్‌టౌన్‌ వేదికల్లో రెండు సార్లు జొహెన్నెస్‌బర్గ్, మెల్‌బోర్న్, పెర్త్‌లో ఒకసారి బుమ్రా అయిదు వికెట్లు తీశాడు. టెస్టు కెరీర్‌లో బుమ్రా ఓవరాల్‌గా ఓ ఇన్నింగ్స్ అయిదు వికెట్లు 11 సార్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికాలో మూడు.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, వెస్టిండీస్, భారత్‌లో రెండుసార్లు ఈ ఘనత అందుకున్నాడు. భారత్, స్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట కొనసాగుతోంది. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేయగా.. ఆసీస్‌ 104 పరుగులకు ఆలౌటైంది. భారత్‌కు 46 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 19 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 79 రన్స్ చేసింది. భారత్ ఆధిక్యం (119) వంద దాటింది. జైస్వాల్ (37), రాహుల్ (28) క్రీజులో ఉన్నారు.

Post a Comment

أحدث أقدم