ఒకే రాష్ట్రం-ఒకే కార్డు పేరిట పైలట్​ ప్రాజెక్టు కార్యక్రమాన్ని సీఎం రేవంత్​ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  మూసీ పరీవాహక ప్రాంతంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. చెరువు స్థలాల్లో ఫాం హౌస్ లు కట్టుకున్నవి కూల్చలా, వద్దా అని ప్రశ్నించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే కుటుంబ డిజిటల్​ కార్డు ఇవ్వాలని ఆలోచించామని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. రేషన్​ కార్డు కోసం పదేళ్లు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారని, కేసీఆర్​ అధికారంలో ఉంటే రేషన్​ కార్డు రాదనే..తమకు అధికారం ఇచ్చారని చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాల అమలుకు డిజిటల్​ కార్డులు అవసరమని చెప్పారు. ప్రతి పేదవాడికి కార్డు ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్నామని స్పష్టం చేసారు. డిజిటల్​ కార్డులో కుటుంబానికి సంబంధించిన వివరాలు ఉంటాయని తెలిపారు. ఫ్యామిలీ కార్డు ఉంటే చాలు రేషన్​ ఎక్కడైనా తీసుకోవచ్చని సీఎం రేవంత్​ రెడ్డి వివరించారు. ఫ్యామిలీ డిజిటల్​ కార్డులో 30 శాఖలకు సంబంధించిన సమాచారం ఉంటుందని వెల్లడించారు. అధికారం కోల్పోవడంతో విచక్షణ కోల్పోయి బీఆర్​ఎస్​ నేతలు మాట్లాడుతున్నారన్నారు. బీఆర్​ఎస్​ ఖాతాల్లో రూ.1,500 కోట్లు ఉన్నాయని, వాటిలో రూ.500 కోట్లు మూసీ పరిధిలోని పేదలకు పంపిణీ చేయాలని సూచించారు. ఇదే సమయంలో రేవంత్ మరో కీలక ప్రకటన చేసారు. హైడ్రాపై అసెంబ్లీలో చర్చించామని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. ఆనాడు హైడ్రాపై సూచనలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మూసీ పరీవాహక ప్రాంత పేదలకు 15 వేల ఇళ్ల కేటాయింపునకు ఆదేశాలు ఇచ్చామన్నారు. డబుల్​ బెడ్​ రూమ్​ ఇళ్ల కంటే ప్రత్యామ్నాయం ఏముందని ప్రశ్నించారు. అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వచ్చి సలహాలు ఇవ్వండని ప్రతిపక్షాలకు సూచించారు. కేటీఆర్​, హరీశ్​రావు, సబిత కుమారుల ఫామ్​హౌస్​లు కూల్చాలా ? వద్దా ? చెప్పండని అడిగారు. మూసీని అడ్డం పెట్టుకుని ఎంతకాలం బతుకుతారు, హైదరాబాద్​లో మీ భరతం పడతామని హెచ్చరించారు.

Post a Comment

أحدث أقدم