దేశంలో మంకీ పాక్స్‌ రెండో కేసు నమోదైంది. కేరళ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు బుధవారం నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ రోగిని ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎం పాక్స్‌కు సంబంధించిన ప్రోటోకాల్స్‌ను పాటిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. మలప్పురానికి చెందిన 38 ఏళ్ల వ్యక్తి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎంపాక్స్‌ లక్షణాలు కనిపించాయని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఆ వ్యక్తి ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వ మంజేరి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యాడని అన్నారు. అతడికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఎంపాక్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. ఈ లక్షణాలు గమనించిన వారు ఆరోగ్య శాఖకు తెలియజేయడంతోపాటు వెంటనే చికిత్స పొందాలని ప్రజలను కోరారు. కాగా, తొమ్మిది రోజుల కిందట దేశంలో మంకీ పాక్స్‌ తొలి కేసు నమోదైంది. పశ్చిమ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చిన ఢిల్లీ యువకుడికి ఈ వైరస్‌ సోకింది. దీంతో అతడ్ని ప్రత్యేక ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ వైరస్‌ విస్తృతంగా వ్యాపించే సూచనలు లేవని పేర్కొంది. మంకీ పాక్స్‌ వైరస్ 'క్లాడ్ 2' ఉనికిని దేశంలో గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 2022 జూలైలో దేశంలో నమోదైన 30 కేసులు మాదిరిగానే ప్రస్తుతం ఈ వైరస్‌ ఉనికి ఉందని పేర్కొంది.

Post a Comment

أحدث أقدم