భారీ వర్షాల నేపధ్యంలో వయనాడ్ లో భారీ వైపరీత్యం ముంచుకొస్తుందని కేరళ రాష్ట్రాన్ని జులై 23నే హెచ్చరించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం పార్లమెంట్లో పేర్కొనడంపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. ఇది పరస్పర నిందారోపణలకు సమయం కాదని స్పష్టం చేశారు. తాము ముందే హెచ్చరించినా కేరళ తగిన విధంగా స్పందించి అప్రమత్తం కాలేదని అమిత్ షా పార్లమెంట్లో పేర్కొనడాన్ని ఉద్దేశించి విజయన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కొండచరియలు విరిగిపడే ముందు ఐఎండీ కేవలం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ మాత్రమే జారీ చేసిందని విజయన్ గుర్తుచేశారు. ఐఎండీ అంచనాలకు మించి వయనాద్లో 500మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వాస్తవంగా అంతకుమించే వర్షాలు కురిశాయని సీఎం తెలిపారు. ఇది ఐఎండీ ముందస్తు హెచ్చరికల కంటే చాలా అధికమని చెప్పారు. వైపరీత్యానికి ముందు ఈ ప్రాంతం ఎన్నడూ రెడ్ అలర్ట్లో లేదని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన అనంతరం ఉదయం ఆరు గంటలకు రెడ్ అలర్ట్ జారీ చేశారని తెలిపారు. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ప్రకృతి వైపరీత్యం గురించి పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వాన్ని వారం రోజుల ముందే అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ఈ మేరకు కేరళలో చోటు చేసుకున్న ప్రకృతి వైపరీత్యంపై పార్లమెంట్లో ప్రకటన చేశారు.'కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించాం. ఈ ముప్పు గురించి జులై 23నే అప్రమత్తం చేశాం. దక్షిణాది రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసి.. కేంద్రం తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేరళకు పంపింది. కానీ, కేరళ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సకాలంలో ప్రజలను తరలించలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల రాకతో పినరయి విజయన్ ప్రభుత్వం అప్రమత్తమై ఉండి ఉంటే.. ఇప్పుడు ఇన్ని మరణాలు సంభవించేవి కావు. ఏది ఏమైనప్పటికీ రాజకీయాలకు అతీతంగా కేరళ ప్రభుత్వానికి, ప్రజలకు అండగా నిలవాల్సిన సమయం ఇది' అని అమిత్షా పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల గురించి కనీసం ఏడు రోజుల ముందుగానే హెచ్చరికలు ఇవ్వగల నాలుగు దేశాల్లో భారత్ కూడా ఒకటని ఈ సందర్భంగా అమిత్ షా పార్లమెంట్కు తెలిపారు.
إرسال تعليق