ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బీహార్ ర్యాలీలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. 'ఇండియా' కూటమి తన దాస్యాన్ని చాటుతూ ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు వారిముందు ముజ్రా (పురుషులను ఆకట్టుకునేందుకు మహిళలు చేసే ఓ రకమైన నృత్యం) చేస్తోందని ఘాటు విమర్శలు చేశారు. వీటిపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రధాని పదవి మర్యాద పాటించాల్సిన బాధ్యత ఆయనకు లేదా? అని మండిపడ్డారు. ''బీహార్ ఎన్నికల ప్రచారంలో విపక్షాలపై ప్రధాని మోడీ అభ్యంతరకర భాషను ప్రయోగించారు. ప్రతిపక్ష నేతలను దారుణంగా అవమానించారు. చరిత్రలో ఏ ప్రధాని అయినా ఇలాంటి పదాలు ఉపయోగించారా? ప్రధాని పదవి మర్యాదను పాటించాల్సిన బాధ్యత ఆయనకు లేదా? ప్రధాని హోదాను మేం చాలా గౌరవిస్తాం. కానీ ఈ ఎన్నికల్లో ఆయన అసలు స్వరూపం బయటపడింది. ఈ దేశ ప్రజలకు ప్రతినిధిని అన్న విషయాన్ని ఆయన మర్చిపోతున్నట్లున్నారు. ఇలాగైతే భావితరాలు మన గురించి ఏం చెబుతాయి?'' అని ప్రియాంక ధ్వజమెత్తారు. ప్రధాని వ్యాఖ్యలను ఇతర విపక్ష నేతలు కూడా ఖండించారు. రాజ్యాంగపరమైన ఉన్నత పదవిలో ఉన్న మోడీ తన మాటలపై నియంత్రణ కోల్పోతున్నారని, ఇది దురదృష్టకరమని ఆమ్ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు.
إرسال تعليق