బెంగళూరులో సోమవారం రాత్రి జరిగిన ముగ్గురి హత్య ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తన ప్రేమకు అడ్డు వస్తున్నారనే నెపంతో శ్వేత అనే యువతి, తన ప్రియుడు కెనెత్‌తో కలిసి కన్న తల్లిదండ్రులను, సొంత చెల్లిని అత్యంత క్రూరంగా చంపింది. హత్యానంతరం పరారైన శ్వేతను పోలీసులు 6 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించి, చివరకు పుదుచ్చేరి రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆమె ప్రియుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. తమిళనాడుకు చెందిన సోమసుందర్, ముత్తులక్ష్మి దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి బెంగళూరులో స్థిరపడ్డారు. పెద్ద కుమార్తె శ్వేత సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ కెనెత్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. దీనిని తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో ఆమె ఇల్లు వదిలి ప్రియుడి వద్దకు వెళ్ళిపోయింది. అయితే శ్వేత తీసుకున్న 30 లక్షల రూపాయల బ్యాంకు లోన్ ఈఎంఐలు చెల్లించకపోవడంతో మారతహళ్లిలోని తండ్రి ఇంటికి నోటీసులు వచ్చాయి. ఆ ఆధారంతో కూతురి జాడ కనుగొన్న తల్లి ముత్తులక్ష్మి, ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లి మందలించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శ్వేత, ప్రియుడితో కలిసి తల్లిని కత్తితో పొడిచి చంపింది. అనంతరం పథకం ప్రకారం తండ్రిని, సోదరిని భోజనానికి రావాలంటూ అదే ఇంటికి పిలిపించి, వారిపై కూడా ఘాతుకానికి ఒడిగట్టింది. మృతదేహాలపై 30 నుండి 40 సార్లు కత్తితో పొడిచిన తీవ్ర గాయాలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రాథమిక విచారణలో నిందితురాలు శ్వేత పోలీసుల ఎదుట విస్తుపోయే నిజాలు వెల్లడించింది. తన తల్లిదండ్రులు తనకు స్వేచ్ఛ ఇవ్వకుండా తన జీవితాన్ని పూర్తిగా నియంత్రించేవారని, అందుకే ఈ హత్యలు చేశానని నిర్వేదంగా సమాధానమిచ్చింది. కాగా, హత్య జరిగిన ఇంట్లో పోలీసులకు లభ్యమైన శ్వేత వ్యక్తిగత డైరీలో ఆమె మానసిక స్థితిని ప్రతిబింబించే కొన్ని కీలక వ్యాఖ్యలు దొరికాయి. “నేను చాలా బాధలో ఉన్నాను. ఒంటరిగా ఉన్నాను. ప్రేమను పొందుతున్నాను. కుంగుబాటుకు (డిప్రెషన్) గురయ్యాను. నేను గొప్పదాన్ని” - శ్వేత రాసుకున్న డైరీలోని వాక్యాలు. ప్రస్తుతం మృతదేహాలను బిదరహళ్లిలోని ఆసుపత్రికి తరలించి, కేసును అన్ని కోణాల్లోనూ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.