ఏప్రిల్ నెలలో 5.63 లక్షల యూనిట్లను విక్రయించి హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రికార్డు సృష్టించింది. ఈ గణాంకాలను విశ్లేషిస్తే సగటున గంటకు 778 వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది సుమారు 17 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. దేశీయ రోడ్లపై ప్రతి సెకనుకు ఒక హోండా బండి కనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల తొలి ప్రాధాన్యతగా మారిన యాక్టివా స్కూటర్లు, షైన్ బైకులు అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో కేవలం భారతదేశంలోనే 4.84 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అంటే గత ఏడాది కంటే సుమారు 14.7 శాతం ఎక్కువ మంది కస్టమర్లు హోండా నాణ్యతను నమ్మారు. నమ్మకమైన ఇంజిన్, తక్కువ మెయింటెనెన్స్, మంచి రీసేల్ వాల్యూ ఉండటమే దీనికి ప్రధాన కారణం. దేశంలోనే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లలో కూడా 'మేడ్ ఇన్ ఇండియా' హోండా వాహనాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తున్న బైకులను విదేశీ కస్టమర్లు ఎగబడి కొంటున్నారు. ఈ ఏడాది ఎగుమతుల్లో ఏకంగా 37 శాతం వృద్ధి సాధించి, 79,600 యూనిట్లకు చేరుకోవడం కంపెనీ గ్లోబల్ డిమాండ్కు అద్దం పడుతోంది. ఒక వాహనాన్ని అమ్మడమే కాకుండా, దానికి తగిన సర్వీసింగ్ అందించడంలో హోండా ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,000 కంటే ఎక్కువ టచ్ పాయింట్స్ ఉన్నాయి. మారుమూల గ్రామం నుంచి మెట్రో నగరం వరకు ఎక్కడ చూసినా హోండా సర్వీస్ అందుబాటులో ఉండటం కస్టమర్లలో భద్రతా భావాన్ని పెంచుతోంది. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచేందుకు హోండా భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. రాజస్థాన్లోని అల్వార్ జిల్లా తపుకారా ప్లాంట్లో మూడవ ఉత్పత్తి లైన్ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం రూ. 1,500 కోట్ల భారీ పెట్టుబడిని కేటాయించింది. 2028 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తయితే వేల సంఖ్యలో యువతకు కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ సందర్భమంగా హోండా సీఈఓ త్సుత్సుము ఒటాని మాట్లాడుతూ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త ఫీచర్లతో ఉత్పత్తులను అందించడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు. ముఖ్యంగా 125cc నుంచి 160cc విభాగంలో మరిన్ని ఇన్నోవేటివ్ మోడల్స్ను తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.
0 Comments