ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో అదృశ్యమైన ఆరేళ్ల చిన్నారి ప్రణవి క్షేమంగా దొరకడంతో ఆమె తల్లి కళ్యాణి ఆనందం వ్యక్తం చేశారు. డయల్-100కు సమాచారం ఇచ్చిన వెంటనే స్పందించి, రాత్రంతా గాలింపు చేపట్టి తన కుమార్తెను క్షేమంగా అప్పగించిన పోలీసులకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రణవి కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లి కళ్యాణి వెంటనే డయల్-100కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆలస్యం చేయకుండా భారీ గాలింపు చేపట్టారు. రాత్రంతా 200 మంది పోలీసులతో పాటు డ్రోన్లు, జాగిలాలను వినియోగించి చిన్నారి కోసం గాలించారు. చివరకు జొన్న చేనులో క్షేమంగా ప్రణవిని గుర్తించి తల్లికి అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసుల వేగవంతమైన స్పందనపై కళ్యాణి హర్షం వ్యక్తం చేస్తూ, జిల్లా ఎస్పీ సునీల్ షొరాన్తో పాటు గాలింపులో పాల్గొన్న ప్రతి పోలీసు అధికారి, సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
0 Comments