గోవాలో రోడ్డు పక్కన చెత్త వేస్తున్నట్లు ఉన్న ఒక చిన్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ కావడంతో, నెటిజన్ల నుండి వచ్చిన తీవ్ర అవమానాలను, కామెంట్లను తట్టుకోలేక ఓ 23 ఏళ్ల కాలేజీ విద్యార్థి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోవాకు చెందిన శామ్యూల్ డి బ్రగాంకా (23) అనే యువకుడు డిగ్రీ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసి, తన తల్లి, ఇద్దరు సోదరీమణులతో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల శామ్యూల్ రోడ్డు పక్కన చెత్త వేస్తున్నట్లు ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ వీడియో ఆధారంగా నెటిజన్లు అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడమే కాకుండా, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆన్లైన్లో పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన ఒత్తిడి కారణంగా స్థానిక మాపుసా పోలీసులు ఆ విద్యార్థిపై కేసు నమోదు చేసి, విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. శామ్యూల్ కూడా పోలీస్ స్టేషన్కు వెళ్లి విచారణకు పూర్తిగా సహకరించాడు.పోలీస్ కేసు ఒకవైపు, మరోవైపు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో తనపై వస్తున్న అత్యంత దారుణమైన మరియు వ్యక్తిగత కామెంట్లు శామ్యూల్ను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేశాయి. సమాజంలో జరిగిన ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయిన శామ్యూల్, శనివారం తన ఇంట్లో ఉన్న లైసెన్స్డ్ తుపాకీతో స్వయంగా కాల్చుకున్నాడు. తీవ్ర రక్తస్రావమైన అతనిని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ, అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆ వైరల్ వీడియో మరియు ఆన్లైన్ ట్రోలింగ్ కారణంగానే తమ కొడుకు తీవ్ర కలత చెంది ప్రాణాలు తీసుకున్నాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతూ పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై, ట్రోలింగ్ చేసిన అకౌంట్లపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments