మార్కెట్లో వంట నూనెల ధరలు గత 30 రోజుల్లో 22 శాతం మేర పెరిగాయి. లీటరుకు సుమారు 20 నుండి 30 రూపాయల వరకు ధర పెరిగింది. సన్ఫ్లవర్ ఆయిల్ 180 రూపాయల నుండి 200 రూపాయలకు చేరింది. పామ్ ఆయిల్ 120 రూపాయల నుండి 145 రూపాయలకు పెరిగింది. వేరుశనగ నూనె లీటరుకు 15 నుండి 20 రూపాయలు పెరిగింది. రైస్ బ్రాన్ ఆయిల్ 150 నుండి 165 రూపాయలకు పెరిగింది. వనస్పతి మరియు సోయాబీన్ నూనెలు: లీటరుకు 160 నుండి 170 రూపాయల మధ్య విక్రయిస్తున్నారు. ఆవనూనె 130 రూపాయల నుండి 160 రూపాయలకు పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చింది. వంట నూనెల ధరలు అకస్మాత్తుగా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు కారణమని తెలుస్తోంది. దేశానికి అవసరమైన సన్ఫ్లవర్ ఆయిల్లో ఎక్కువ భాగం ఉక్రెయిన్, రష్యా నుండి దిగుమతి అవుతుంది. అక్కడ యుద్ధ వాతావరణం మరియు మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల సరఫరా వ్యవస్థలో అంతరాయం కలిగింది. సరఫరా తగ్గి డిమాండ్ పెరగడం వల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. అంతర్జాతీయ కారణాలు ఒకవైపు ఉంటే, స్థానికంగా కొందరు వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లాభాపేక్షతో కొందరు విక్రేతలు నిల్వలు పెంచుకుంటూ మార్కెట్లో నూనె కొరత ఉన్నట్లు భ్రమింపజేస్తున్నారు. మరికొన్ని చోట్ల కంపెనీల అసలు విక్రయ ధర కంటే గరిష్ట విక్రయ ధరను ఎక్కువగా ముద్రించి వినియోగదారుల నుండి అధిక వసూలు చేస్తున్నారు.
0 Comments