అడోబ్ సీఈవో శంతను నారాయణ్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన దాదాపు 18 ఏళ్ల పాటు కంపెనీని విజయవంతంగా నడిపించి, సంస్థలో కీలక మార్పులకు నాంది పలికారు.కొత్త సీఈవో బాధ్యతలు చేపట్టే వరకు ఆయన తన పదవిలో కొనసాగుతారని అడోబ్ సంస్థ స్పష్టం చేసింది. సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, బోర్డు ఛైర్మన్గా కంపెనీకి తన మార్గదర్శకత్వాన్ని అందిస్తూనే ఉంటారు. శంతను నారాయణ్ వారసుడిని ఎంపిక చేసే ప్రక్రియను అడోబ్ బోర్డు ఇప్పటికే ప్రారంభించింది. ఇందుకోసం ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కంపెనీలో ఉన్న అంతర్గత సమర్థులైన అధికారులతో పాటు, బయటి నుండి కూడా అనుభవజ్ఞులైన నిపుణులను ఈ పదవి కోసం బోర్డు పరిశీలిస్తోంది. అత్యంత పారదర్శకంగా, సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. శంతను నారాయణ్ నాయకత్వంలో అడోబ్ సాధించిన పరివర్తన అద్భుతమని, ఏఐ యుగంలో కంపెనీ విజయానికి ఆయన బలమైన పునాది వేశారని అడోబ్ లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఫ్రాంక్ కాల్డెరోనీ ప్రశంసించారు.ఈ సందర్భంగా శంతను నారాయణ్ ఉద్యోగులను ఉద్దేశించి ఒక సందేశం పంపారు. '18 ఏళ్ల తర్వాత సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. నా హయాంలో కంపెనీ 3,000 మంది ఉద్యోగుల నుంచి 30,000 మందికి పెరిగింది. ఆదాయం బిలియన్ డాలర్ల నుంచి 25 బిలియన్ డాలర్లకు చేరింది. మనం కలిసి సాధించిన ఈ ఘనత పట్ల చాలా గర్వంగా ఉంది' అని ఆయన పేర్కొన్నారు.
0 Comments