ఆంధ్రప్రదేశ్ లో 2018లో గ్రూప్ 1 అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలపై హైకోర్టు ఆదేశాలతో సిట్ విచారణ చేస్తుంది. అప్పట్లో ఉద్యోగాలు పొందిన వారిని అప్రాధాన్య పోస్టుల్లోకి మార్చాలంటూ గత విచారణలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు. దీంతో ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఇవాళ సీఎస్ విజయానంద్ ను హైకోర్టుకు పిలిపించి వివరణ తీసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి 2018 గ్రూప్ 1 పరీక్షలో ఉత్తీర్ణులై ప్రస్తుతం వివిధ శాఖల్లో కీలక పోస్టుల్లో ఉన్న అధికారుల్ని వెంటనే అప్రాధాన్య పోస్టుల్లోకి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అందులో సదరు గ్రూప్ 1 అధికారుల్ని అప్రాధాన్య పోస్టుల్లోకి మారుస్తున్నట్లు ఇవాళ సాయంత్రం 7 గంటల్లోకా తనకు నివేదిక పంపాలని ఉన్నతాధికారులకు సీఎస్ ఆదేశాలు పంపారు. 2018 గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని కొందరు అభ్యర్ధులు హైకోర్టుని ఆశ్రయించారు. అప్పటి నుంచీ దీనిపై విచారణ జరుగుతోంది. అయితే తాజాగా ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు అప్పటి జవాబు పత్రాల్ని భద్రపరచడంతో పాటు మూల్యాంకనంలో చోటు చేసుకున్న లోపాలపై సిట్ దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం సిట్ ను నియమించి దర్యాప్తు చేయిస్తోంది. ఈ దర్యాప్తు పూర్తయ్యే వరకూ అప్పట్లో నియామకాలు పొందిన వారిని కీలక పోస్టుల్లో నుంచి అప్రాధాన్య పోస్టుల్లోకి మార్చాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయని సీఎస్ ను హైకోర్టు ఇవాళ పిలిపించి మందలించినట్లు తెలుస్తోంది.
0 Comments