గురుగ్రామ్ లోని సెక్టార్-37 లోని 'ఎన్డీఆర్ ఆటో కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్' కంపెనీ ప్రాంగణంలో విధుల నిర్వహణలో చోటుచేసుకున్న చిన్నపాటి తగాదా తీవ్ర విషాదానికి దారితీసింది. సహోద్యోగితో జరిగిన వాగ్వాదం అనంతరం 25 ఏళ్ల శివాని అనే యువతిపై 35 ఏళ్ల అస్లాం మియాన్ కత్తెరతో మెడపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన కత్తెరను స్వాధీనం చేసుకున్నారు. గురుగ్రామ్ సెక్టార్-37 లోని ఎన్డీఆర్ ఆటో కంపెనీలో జూలై 13న శివాని ఉద్యోగంలో చేరింది. ఘటన జరిగిన రోజు అస్లాం మియాన్, శివాని ఇద్దరూ షీట్ కవర్లు కత్తిరించే విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, శివాని అస్లాంను చెంపదెబ్బ కొట్టింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అస్లాం, కత్తెరతో ఆమె మెడపై దాడి చేశాడు. మెడపై బలమైన గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావమైన శివానిని పటౌడీ రోడ్డులోని కదీపూర్ వైదిక్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న క్రైమ్ టీమ్, ఫింగర్ప్రింట్ నిపుణులు కంపెనీకి చేరుకుని రక్తపు మరకల దుస్తులు, ఇతర సాక్ష్యాలను సేకరించారు. ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీని కూడా విశ్లేషిస్తున్నారు. శివాని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్టార్-37 పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదైంది. బిహార్లోని తూర్పు చంపారన్ జిల్లాకు చెందిన నిందితుడు అస్లాం మియాన్ ను పోలీసులు అరెస్టు చేశారు.
చెంపదెబ్బ కొట్టిందని కత్తెరతో విచక్షణారహితంగా దాడి : చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన మహిళ
September 07, 2026
0
Tags