దేశీయ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ సరికొత్త 'S1Z' ఎలక్ట్రిక్ స్కూటర్ను రిలీజ్ చేసింది. పూర్తిగా భారత్లోనే సొంతంగా తయారుచేసిన భారత్ సెల్ LFP బ్యాటరీ సాంకేతికతతో ఈ స్కూటర్లను రూపొందించడం విశేషం. స్వదేశీ టెక్నాలజీని వినియోగించడం ద్వారా బ్యాటరీ వ్యయాన్ని గణనీయంగా తగ్గించి, సామాన్య వినియోగదారులకు కూడా అందుబాటు ధరల్లో ఈ వాహనాలను ఓలా పరిచయం చేసింది. ఓలా ఎలక్ట్రిక్ విడుదల చేసిన 'S1Z' స్కూటర్ శ్రేణి రెండు ప్రధాన బ్యాటరీ వేరియంట్లలో లభించనుంది. 3.1 kWh వేరియంట్ ప్రారంభ ధర రూ.79,999 నిర్ణయించారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 179 కి.మీ ప్రయాణించవచ్చు. ఇక 5.1 kWh వేరియంట్ ప్రారంభ ధర రూ.99,999గా ఫిక్స్ చేయగా.. గరిష్టంగా ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 301 కి.మీ ప్రయాణించేలా స్కూటర్ను రూపొందించారు. ఈ స్కూటర్లు మ్యాచా గ్రీన్, స్కై స్ప్లాష్ బ్లూ, వైట్, ఆంత్రాసైట్ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో 12 ఇంచుల వీల్స్తో లభించనున్నాయి. 'MoveOS 5' సాఫ్ట్వేర్పై పనిచేసే ఈ స్కూటర్లలో క్రూయిజ్ కంట్రోల్, అడ్వాన్స్డ్ రీజనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ మోడ్, జీపీఎస్, ఓటీఏ అప్డేట్లు, ఇరుకైన ప్రదేశాల్లో సులభంగా పార్క్ చేయడానికి ఉపయోగపడే ఈజీ పార్క్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. 3.1 kWh వేరియంట్ డెలివరీలు డిసెంబర్ 2026 నుంచి, అలాగే 5.1 kWh వేరియంట్ డెలివరీలు మార్చి 2027 నుంచి ప్రారంభమవుతాయని ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది.
0 Comments