ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డ రోడ్డు సెంటర్ వద్ద ఆటోను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో వారిని గుంటూరు జీజీహెచ్కు తరలించారు. బాధితులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామస్థులుగా పోలీసులు తెలిపారు. వీరంతా ప్రకాశం జిల్లా కొండమంజులూరులో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హాస్పిటల్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, సత్య కుమార్ స్పందించారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందడం, పలువురు గాయపడటంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
0 Comments