తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మీడియా పేరు చెప్పి ఓ రైతును బెదిరించి బలవంతంగా నగదు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శుక్రవారం అశ్వారావుపేట పోలీస్స్టేషన్లో సీఐ పింగళి నాగరాజు వివరాలు వెల్లడించారు. ఈ నెల 23న తెల్లవారుజామున దమ్మపేటకు చెందిన పండు కిరణ్, సయ్యద్ జానీ అహ్మద్ అనే ఇద్దరు వ్యక్తులు రామచంద్రపురం క్రాస్రోడ్డు వద్ద పొగాకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను అడ్డగించారు. తాము మీడియా ప్రతినిధులమని చెప్పి, ట్రాక్టర్ నడుపుతున్న ముష్టిబండకు చెందిన రైతు కొలికిపోగు నరేంద్రను బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. దీనికి ప్రతిఘటించిన రైతు డయల్ 112కు ఫోన్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో నిందితులు రైతును చంపుతామని బెదిరించి, అతని వద్ద ఉన్న రూ.5 వేల నగదును బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1,000 నగదు, 'టీ మీడియా' పేరుతో ఉన్న ప్రెస్ ఐడీ కార్డు, నేరానికి ఉపయోగించిన టీవీఎస్ మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. మీడియా గుర్తింపు కార్డులను దుర్వినియోగం చేస్తూ బెదిరింపులకు, అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అశ్వారావుపేట పోలీసులు హెచ్చరించారు.
0 Comments