ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్.బీఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, అంతర్వేది తీర ప్రాంతంలో పరిమితికి మించి ప్రయాణికులతో సముద్రంలోకి వెళ్లిన ఓ స్పీడ్ బోట్ మధ్యలోనే నిలిచిపోవడంతో అందులోని పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొంతసేపు అలల మధ్య ప్రాణభయంతో గడిపిన పర్యాటకులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంతర్వేది తీర ప్రాంతంలోని షిప్పింగ్ యార్డు వద్ద ప్రైవేటు సంస్థ స్పీడ్ బోట్లను నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే సంబంధిత శాఖల అనుమతులు, కనీస అనుభవం లేకుండానే ఒక ప్రైవేటు సంస్థకు చెందిన బోట్లను నడుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోట్ల నిర్వహణకు అవసరమైన ఫిట్నెస్ సర్టిఫికెట్లు, బీమా, డ్రైవర్లకు చెల్లుబాటు అయ్యే లైసెన్సులు ఉన్నాయా లేదా అన్నదానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తీర ప్రాంతాల్లో బోట్ల నిర్వహణకు నిర్దిష్ట నిబంధనలు అమల్లో ఉన్నాయి. అలాగే నదీ మార్గాల్లో బోట్ల రాకపోకలకు ఇరిగేషన్ శాఖ నుంచి రూట్ మ్యాప్ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర అంతర్గత జలరవాణా సంస్థ నుంచి సంబంధిత సర్టిఫికెట్లు పొందడం కూడా తప్పనిసరి. అయినప్పటికీ కొన్ని బోట్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశమవుతున్నాయి.
0 Comments