ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరమే లక్ష్యంగా రష్యా బలగాలు బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడ్డాయి. గత రాత్రి జరిగిన ఈ ఘోర దాడుల్లో కీవ్ నగరం అతలాకుతలమైంది. ఈ రాకెట్ దాడుల ధాటికి భారీగా ఆస్తి నష్టం సంభవించడంతో పాటు ప్రాణనష్టం కూడా చోటుచేసుకుంది. ఉక్రెయిన్ అంతటా వైమానిక దాడుల సైరన్లు మారుమోగుతుండగా, రష్యా క్షిపణులు కీవ్ నగరంలోని నివాస సముదాయాలపై పడ్డాయి. రష్యా చేసిన ఈ దాడుల్లో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తక్షణమే ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ స్పందిస్తూ రష్యాతో పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కీవ్ నగరంపై జరిగిన అత్యంత భారీ, ఘోరమైన బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో ఇది ఒకటని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధ క్షేత్రంలో సైన్యంతో కాకుండా, రష్యా ఉద్దేశపూర్వకంగానే సామాన్య పౌరులు నివసించే ప్రాంతాలను టార్గెట్ చేస్తోందని ఉక్రెయిన్ అధికారులు మండిపడుతున్నారు. గత రాత్రి జరిగిన దాడిలో పౌరులు నివసించే బహుళ అంతస్తుల నివాస భవనాలు, ఒక పెద్ద సూపర్ మార్కెట్, అలాగే విద్యార్థులు/కార్మికులు ఉండే వసతి గృహం తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేలుళ్ల ధాటికి భవనాల శిథిలాలు రోడ్లపై పడటంతో స్థానికులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బంకర్లలో తలదాచుకున్నారు. రష్యా వైమానిక దాడులను తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థ తీవ్రంగా శ్రమించింది. రష్యా సైన్యం ఏకకాలంలో ప్రయోగించిన 41 క్షిపణులలో 18 క్షిపణులను ఉక్రెయిన్ గగనతలంలోనే విజయవంతంగా కూల్చివేసింది. క్షిపణులతో పాటు ఉక్రెయిన్ నగరాలపై దాడికి వచ్చిన 108 రష్యన్ డ్రోన్లను ఉక్రెయిన్ ఆర్మీ అడ్డుకుని, కూల్చివేసినట్లు ఆ దేశ సైనిక ప్రధాన కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.
0 Comments