Ad Code

మధుమేహ వ్యాధిగ్రస్తులు వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకునే బేసల్ ఇన్సులిన్ విడుదల

ధుమేహ వ్యాధిగ్రస్తులు వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకునే బేసల్ ఇన్సులిన్ ను దేశంలో విడుదల అయింది. డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ నోవో నోర్డిస్క్  Awiqli (ఇన్సులిన్ ఐకోడెక్) పేరుతో ఈ కొత్త ఇన్సులిన్‌ను భారత మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త చికిత్సతో రోజూ ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా, సంవత్సరానికి 365 ఇంజెక్షన్ల స్థానంలో కేవలం 52 ఇంజెక్షన్లు సరిపోతాయి. దీంతో మధుమేహ రోగుల చికిత్స భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇన్సులిన్ అనేది శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే హార్మోన్. ఇది రక్తంలో ఉన్న గ్లూకోజ్ (చక్కెర)ను కణాల్లోకి చేరేలా చేసి శక్తిగా మారుస్తుంది. టైప్-1 మధుమేహం ఉన్నవారికి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి కావడం ఆగిపోతుంది. అలాగే కొంతమంది టైప్-2 మధుమేహ రోగులకు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు ఇన్సులిన్ చికిత్స అవసరమవుతుంది. సాధారణంగా బేసల్ ఇన్సులిన్‌ను రోజుకు ఒకసారి లేదా అంతకంటే ఎక్కువసార్లు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొత్తగా విడుదలైన Awiqliను వారానికి ఒక్కసారి మాత్రమే FlexTouch Pen ద్వారా తీసుకుంటే సరిపోతుంది. దీంతో చికిత్సను సులభంగా కొనసాగించే అవకాశం పెరుగుతుందని కంపెనీ తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక మధుమేహ బాధితులు ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. సుమారు 10.1 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. మరో 13.6 కోట్ల మంది ప్రీ-డయాబెటిస్ దశలో ఉన్నారు. 9 లక్షలకు పైగా మంది టైప్-1 మధుమేహంతో జీవిస్తున్నారు. టైప్-2 మధుమేహ రోగుల్లో దాదాపు 10 శాతం మందికి ఇన్సులిన్ చికిత్స అవసరమవుతోంది. భారత్‌లో చాలామంది రోగులు ప్రతిరోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలనే భయంతో చికిత్సను ఆలస్యం చేస్తున్నారని నోవో నోర్డిస్క్ తెలిపింది. ఈ కారణంగా అవసరమైన సమయానికి ఇన్సులిన్ ప్రారంభించడంలో 7 నుంచి 9 సంవత్సరాల వరకు ఆలస్యం జరుగుతోందని కంపెనీ వెల్లడించింది. వారానికి ఒక్కసారి మాత్రమే ఇన్సులిన్ తీసుకునే విధానం ఈ భయాన్ని తగ్గించి, రోగులు త్వరగా చికిత్స ప్రారంభించేందుకు సహాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu