హైదరాబాద్ కోఠిలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూనియర్ విద్యార్థులను వేధించారనే ఆరోపణలపై పలువురు సీనియర్ విద్యార్థులపై యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. బీడీఎస్ (బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ) మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్ చేసినందుకు గాను ఫైనల్ ఇయర్ విద్యార్థులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కాలేజీలో ర్యాగింగ్ జరిగినట్లు బాధితులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ వెంటనే స్పందించారు. ఆయన ఇచ్చిన అధికారిక ఫిర్యాదు ఆధారంగా సుల్తాన్ బజార్ పోలీసులు రంగంలోకి దిగారు. ర్యాగింగ్కు పాల్పడినట్లు నిర్ధారణ అయిన 12 మంది ఫైనల్ ఇయర్ బీడీఎస్ విద్యార్థులపై 'తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్' కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారాన్ని కాలేజీ యాజమాన్యం ఎంతో తీవ్రంగా పరిగణించింది. నిబంధనలను ఉల్లంఘించి జూనియర్లను మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టినందుకు గాను ఆ 12 మంది సీనియర్ విద్యార్థులను 6 నెలల పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపల్ ఆదేశాలు జారీ చేశారు. వైద్య విద్యాలయంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు యాంటీ ర్యాగింగ్ కమిటీని మరింత బలోపేతం చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడితే వారి భవిష్యత్తు నాశనమవుతుందని, చట్టపరమైన కఠిన శిక్షలతో పాటు కాలేజీల నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తామని ప్రిన్సిపల్ హెచ్చరించారు. జూనియర్ విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, ధైర్యంగా తమ చదువులపై దృష్టి పెట్టాలని సూచించారు.
0 Comments