ప్రముఖ సినీ నేపథ్య గాయని, ఎస్. జానకి (88) అంత్యక్రియలు ముగిశాయి. కర్ణాటక ప్రభుత్వం మైసూరులో ఆమె అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో అత్యంత ఘనంగా నిర్వహించింది. జానకి మనవరాలు అప్సర విద్యుల శాస్త్రోక్తంగా ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంత్యక్రియల కార్యక్రమానికి ముందు, జానకమ్మ పార్థివదేహాన్ని అభిమానులు మరియు ప్రముఖుల సందర్శనార్థం మైసూరులోని ప్రసిద్ధ మహారాజా కళాశాల మైదానానికి తరలించారు. దశాబ్దాల పాటు వేలాది మధురమైన పాటలతో కోట్లాది మందిని సంగీత ప్రపంచంలో ఊయలాడించిన ప్రియతమ గాయనిని కడసారి చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సినీ ఇండస్ట్రీ పెద్దలు మైదానానికి చేరుకుని ఆమెకు నివాళులర్పించారు. జానకమ్మ భౌతికకాయాన్ని చూసి అభిమానులు బాధాతప్త హృదయాలతో కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమె మృతితో భారతీయ సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసినట్లయింది.
0 Comments