116 ఏళ్ల వృద్ధురాలు నవనీతమ్మ కాలినడకన తిరుమలకు చేరుకోవడంపై తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. శనివారం ఆమె అలిపిరి నడక మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ అచంచలమైన భక్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడిన ఆయన, వృద్ధురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తొలుత సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయినప్పుడు సదరు వృద్ధురాలి పూర్తి వివరాలు లభ్యం కాలేదు. ఆమె కర్ణాటకకు చెందిన వ్యక్తిగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన తితిదే ఛైర్మన్, ఆమె వివరాలు తెలిస్తే వెంటనే తన కార్యాలయాన్ని సంప్రదించాలని 'ఎక్స్' వేదికగా కోరారు. ఆ తర్వాత తితిదే విజిలెన్స్ సిబ్బంది వేగంగా రంగంలోకి దిగి, ఆ వృద్ధురాలిని తమిళనాడుకు చెందిన నవనీతమ్మగా గుర్తించారు. ప్రస్తుతం నవనీతమ్మ తిరుపతిలోని జీవకోనలో ఉన్న తన బంధువుల ఇంట్లో బస చేసినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ సమాచారం అందిన వెంటనే ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ నవనీతమ్మకు, ఆమె కుటుంబానికి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ శ్రీవేంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో ఆమెకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.
0 Comments