హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రాంగ్ రూట్లో ప్రయాణించిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన ద్విచక్ర వాహనం ఎదురుగా వస్తున్న మరో బైక్ను అత్యంత బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం వినోద్ అనే యువకుడు తన బుల్లెట్ బైక్పై గచ్చిబౌలి వైపు నుంచి కొండాపూర్ ఏఎంబీ ఫ్లైఓవర్ మీదుగా హఫీజ్పేట్ మార్గంలో వెళ్తున్నాడు. అదే సమయంలో హఫీజ్పేట్ వైపు నుంచి గచ్చిబౌలి వైపునకు శ్రీకాంత్, విఠల్ అనే ఇద్దరు యువకులు స్కూటీపై ప్రమాదకరంగా రాంగ్ రూట్లోకి దూసుకొచ్చారు. ఫ్లైఓవర్పై వినోద్ తన బుల్లెట్ బైక్పై వేగంగా వెళ్తుండగా ఎదురుగా అంతే వేగంతో రాంగ్ రూట్లో వచ్చిన స్కూటీ ఊహించని విధంగా బుల్లెట్ను నేరుగా ఢీకొట్టింది. ఈ ప్రమాద దాటికి స్కూటీ నడుపుతున్న శ్రీకాంత్, అతని వెనుక కూర్చున్న విఠల్ ఇద్దరూ గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. తీవ్రమైన రక్తస్రావం మరియు తలకు బలమైన గాయాలు కావడంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో బుల్లెట్ నడుపుతున్న వినోద్కు అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఫ్లైఓవర్లపై రాంగ్ రూట్ డ్రైవింగ్ ఎంత ప్రమాదకరమో ఈ ఘటనే నిదర్శనమని పోలీసులు హెచ్చరించారు. ఈ ప్రమాదంపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments