దర్శకుడు భారతీరాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే చిత్రసీమతో పాటు రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం భారతీరాజా పార్థివదేహాన్ని చెన్నైలోని ఆయన నివాసంలో ఉంచారు. సమాచారం అందిన వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అక్కడికి చేరుకొని భారతీరాజా భౌతికకాయానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భారతీరాజా మృతి భారతీయ సినిమా రంగానికి తీరని లోటని సీఎం విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్తో పాటు సీనియర్ నటి రాధిక కూడా భారతీరాజా నివాసానికి చేరుకొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్టాలిన్, దర్శకుడితో తనకున్న పాత అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. "తమిళ సినిమా పంథాను మార్చి, సరికొత్త సృజనాత్మక ధోరణిని సృష్టించిన గొప్ప కళాకారుడు భారతీరాజా. అప్పట్లో కేవలం నాలుగు గోడల స్టూడియోలకే పరిమితమైన కెమెరాలను పల్లెటూళ్లలోకి తీసుకెళ్లి, గ్రామీణ ప్రజల యథార్థ జీవితాలను వెండితెరపై ఆవిష్కరించిన ఘనత ఆయనదే. తమిళ సినిమాను వాస్తవికతకు అద్దం పట్టేలా చేసిన ఆయన చిత్రాలు హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆయన ఎన్నో తరాల దర్శకులకు స్ఫూర్తి" అని స్టాలిన్ కొనియాడారు.
0 Comments