మహిళలతో పోలిస్తే మగవారిలోనే మధుమేహం వ్యాధి కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి. దీనికి కారణం వారి శరీరంలో కొవ్వు పేరుకుపోయే విధానం మరియు జీవక్రియల్లో ఉండే తేడాలే. మగవారిలో పొట్ట భాగంలో కొవ్వు త్వరగా చేరుతుంది, ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీసి షుగర్ వచ్చేలా చేస్తుంది. మధుమేహం మగవారిలో ఎక్కువగా ఉన్నప్పటికీ, ఒకసారి మధుమేహం వస్తే దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మరియు కాంప్లికేషన్స్ మహిళల్లోనే చాలా తీవ్రంగా ఉంటున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న మహిళల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశం, షుగర్ లేని మహిళల కంటే దాదాపు నాలుగు రెట్లు పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మగవారితో పోలిస్తే మహిళలకే ఈ ముప్పు ఎక్కువ. మహిళల జీవితంలో పీరియడ్స్, ప్రెగ్నెన్సీ, ఆ తర్వాత మెనోపాజ్ (పీరియడ్స్ ఆగిపోవడం) వంటి ఎన్నో హార్మోన్ల మార్పులు జరుగుతుంటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే షుగర్ భవిష్యత్తులో శాశ్వత డయాబెటిస్గా మారే ఛాన్స్ ఉంది. ఇక అలాగే మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపు తప్పడం, గుండె సమస్యలు రావడం వేగంగా జరుగుతుంది. గుర్తింపులో ఆలస్యం మరియు నిర్లక్ష్యం: చాలా మంది మహిళలు తమ ఆరోగ్యం కంటే కుటుంబ బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను లైట్ తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ముదిరిపోయే వరకు బయటపడదు. ఇక దీనికి తోడు మానసిక ఒత్తిడి, నిద్రలేమి కూడా తోడై వ్యాధి తీవ్రతను పెంచేస్తాయి. అందుకే మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. షుగర్ అనేది కేవలం రక్తంలో తీపి పెరగడం మాత్రమే కాదు, అది శరీరంలోని ప్రతి అవసరాన్ని దెబ్బతీసే సైలెంట్ కిల్లర్. ముఖ్యంగా మహిళలు తమ ముప్పును గుర్తించి సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, డాక్టర్ల సలహాలతో షుగర్ను కంట్రోల్లో ఉంచుకోవాలి. అప్పుడే ప్రమాదాల బారి నుంచి సురక్షితంగా తప్పించుకోవచ్చు.
0 Comments