ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు కల్పించడం లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా "పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల" ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రాజకీయ పార్టీల్లో సాధారణంగా నాయకత్వం పైస్థాయి నిర్ణయాల ద్వారా ఏర్పడుతుంటే, జనసేన మాత్రం కేడర్ ఆధారిత నాయకత్వ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా ఈ కమిటీలను నియమించారు. ప్రతి ప్రాంతంలో పార్టీ కోసం పనిచేస్తున్న జనసైనికులు, సాధకులు, నాయకుల వివరాలను సేకరించడం ప్రధాన బాధ్యతగా ఉంటుంది.ఈ ప్రక్రియ ద్వారా పార్టీ కోసం నిజాయితీగా శ్రమించిన కార్యకర్తలు ఎవరు? ప్రజల్లో ప్రభావం చూపుతున్న నాయకులు ఎవరు? సంస్థాగత సామర్థ్యం కలిగిన వ్యక్తులు ఎవరు? అనే అంశాలపై పూర్తి స్థాయి సమాచారం సేకరించనున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 28 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నిర్మాణం ఇలా ఒక పరిశీలకుడు ముగ్గురు సీనియర్ నాయకులు, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న ముగ్గురు సాధకులు, వీరితో సమన్వయం చేసే 21 మంది కార్యకర్తలు. మొత్తం 28 మంది సభ్యులు కలిసి క్షేత్రస్థాయిలో విస్తృతంగా సమాచార సేకరణ చేపడతారు. మహిళలకు కూడా ఈ కమిటీల్లో తగిన ప్రాధాన్యం కల్పించడం విశేషం.
0 Comments