తమిళనాడులోని చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్ట్ కు వెళుతున్న సర్కార్ ఎక్స్ప్రెస్ రైలులో ఆదివారం అర్ధరాత్రి దాటాక దొంగలు బీభత్సం సృష్టించారు. బాపట్ల శివారులోని నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో రైలు ప్రయాణిస్తుండగా, ఎస్-3, ఎస్-6 బోగీల్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి దుండగులు ఏడు సవర్ల బంగారు ఆభరణాలను లాక్కున్నారు. బాధితులు, ఇతర ప్రయాణికులు అప్రమత్తమై చైన్ లాగడంతో రైలు అక్కడికక్కడే నిలిచిపోయింది. రైలు ఆగడంతో దొంగలు కిందికి దూకి, సమీపంలోని పొలాల మీదుగా బాపట్ల-గుంటూరు రోడ్డు వైపు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రైలులోనే ఎస్కార్ట్ విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు తక్షణమే స్పందించి, పారిపోతున్న దుండగులపై 9 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు దుండగులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు గ్రామీణ పోలీసులను అప్రమత్తం చేయడంతో, ప్రస్తుతం అప్పికట్ల - బత్తిపూడి పరిసర పొలాల్లో నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
0 Comments