Ad Code

కుంభమేళా తరహాలో గోదావరి 2027 పుష్కరాలు


దేశవ్యాప్తంగా గోదావరి పుష్కరాలను ఆదర్శంగా నిలిచే ఆధ్యాత్మిక మహోత్సవంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో పుష్కరాల నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో అత్యంత పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన మహా కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందుకోసం సమగ్ర బ్లూప్రింట్ రూపొందించి ముఖ్యమంత్రికి సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలోని ఆరు జిల్లాల్లోని పుష్కర ఘాట్ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఘాట్ల నిర్మాణం, మరమ్మతులు, విస్తరణతో పాటు పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య సదుపాయాలు, భక్తుల వసతి, రవాణా వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశమున్నందున ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే ఆయా జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పుష్కర ఘాట్లను స్వయంగా పరిశీలించనున్నట్లు ప్రకటించారు.

Post a Comment

0 Comments

Close Menu