Ad Code

తెలంగాణ నీట్-2026కు పకడ్బందీ ఏర్పాట్లు !

తెలంగాణ నీట్-2026 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. సచివాలయం నుండి అదనపు డిజిపి మహేష్ భగవత్, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సిపిలు, ఇతర అధికారులతో కలిసి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీట్-2026 పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు, వరి ధాన్యం కొనుగోలు, జూన్ 9న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి సభ అంశాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 21న జరగనున్న నీట్-2026 పరీక్షకు 24 పట్టణాలలో 208 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, 72 వేల 956 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, ఇందుకు తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని, రాష్ట్ర, జిల్లా సమన్వయ కమిటీలు అందుకు అనుగుణంగా పని చేయాలని తెలిపారు. ప్రభుత్వ సంస్థలలో మాత్రమే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాలలో సి సి కెమెరాలు ఏర్పాటు చేయాలని, అంతర్జాతీయ యోగా దినోత్సవం దృష్ట్యా పరీక్ష నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు పరీక్షకు చేపట్టిన ఏర్పాట్లపై సమావేశాంలో వివరించారు. అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్ మహేష్ భగవత్ మాట్లాడుతూ, పోలీసు శాఖ, జిల్లా యంత్రాంగం మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. జాతీయ పరీక్షా సంస్థ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ, ఈ ఏడాది పరీక్షల కోసం మరింత కట్టుదిట్టమైన భద్రతా విధానాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షా ప్రశ్నాపత్రాల రవాణా కోసం తొలిసారిగా భారత వైమానిక దళం సేవలను వినియోగిస్తున్నామన్నారు.

Post a Comment

0 Comments

Close Menu