నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నం వేదికగా జరగనున్న 31వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ జరనున్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సదస్సు ఏర్పాట్లు, లక్ష్యాలు, అంతర్జాతీయ భాగస్వామ్యం, పెట్టుబడులు, నాలెడ్జ్ షేరింగ్ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజీత్ బెనర్జీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేవలం పెట్టుబడుల సమ్మిట్గా కాకుండా ప్రపంచ స్థాయి ఆలోచనలకు వేదికగా దీనిని తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. "Navigating Change: Leadership, Technology, Trust and Trade in a Transforming World" అనే థీమ్తో ఈ ఏడాది సదస్సు జరగనుంది. ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో నాయకత్వం, సాంకేతికత, విశ్వాసం, వాణిజ్యం వంటి అంశాలపై లోతైన చర్చలకు ఈ వేదిక ఉపయోగపడనుంది. వ్యాపార ఒప్పందాలు, పెట్టుబడులు మాత్రమే కాదు... భవిష్యత్తు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అంశాలపై మేధోమథనం జరగాలని సీఎం స్పష్టం చేశారు. ప్రధాన భాగస్వామ్య సదస్సుకు ముందు విశాఖ, రాజమండ్రి లేదా కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతి వంటి నగరాల్లో ప్రాంతీయ భాగస్వామ్య సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సమావేశాల ద్వారా స్థానిక పరిశ్రమలు, స్టార్టప్లు, వ్యవసాయ రంగం, సేవారంగ ప్రతినిధులు నేరుగా అంతర్జాతీయ సంస్థలతో అనుసంధానం అయ్యే అవకాశం లభించనుంది. ప్రాంతీయ సమావేశాల్లో కూడా ఎంఓయూలు కుదిరేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. విశాఖలో జరిగే రెండు రోజుల సదస్సులో మినిస్టీరియల్ సెషన్స్, ప్లీనరీ సమావేశాలు, కంట్రీ సెషన్స్, బీ2బీ, బీ2జీ సమావేశాలు, ఎంఓయూ సంతకాలు వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రులు, జాతీయ-అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, విదేశీ డెలిగేట్లు, పరిశ్రమల ప్రముఖులు, విధాన నిర్ణేతలు ఒకే వేదికపై కలుసుకునే అవకాశంగా దీనిని ప్రభుత్వం చూస్తోంది. సదస్సు విజయవంతం కావడానికి జూలై నుంచి సెప్టెంబర్ వరకు దేశ, విదేశాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కోయంబత్తూర్, అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించి పెట్టుబడిదారులను ఆకర్షించనున్నారు. ఈ ప్రచార కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్టుబడి అవకాశాలు, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక విధానాలను ప్రపంచానికి వివరించనున్నారు. సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక కీలక అంశాన్ని ప్రస్తావించారు. "ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని ఎంఓయూలు కుదిరాయి అనేదానికంటే నాలెడ్జ్ షేరింగ్ ఎంత జరిగిందనేదే ముఖ్యమని" ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు తమ అనుభవాలను పంచుకునే వేదికగా ఈ సదస్సు నిలవాలని ఆయన అభిప్రాయపడ్డారు. అదే రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. సదస్సులో కేవలం పరిశ్రమలు, వాణిజ్యం మాత్రమే కాకుండా వ్యవసాయం, ఉద్యానరంగం, ప్రకృతి వ్యవసాయం, సర్క్యులర్ ఎకానమీ, ఆధ్యాత్మికత, స్ట్రెస్ ఫ్రీ వర్క్ కల్చర్ వంటి అంశాలపై కూడా ప్రత్యేక చర్చలు జరగాలని సీఎం సూచించారు. భవిష్యత్తులో ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఫ్యూచరిస్టిక్ రంగాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సదస్సులో ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు చెందిన నిపుణులు, పరిశోధకులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు కలిసి పనిచేసినప్పుడే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే విద్యా ప్రపంచాన్ని కూడా ఈ సదస్సులో భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మరో కీలక ప్రకటన కూడా వెలువడింది. అమరావతిలో సీఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ కేంద్రం ద్వారా భవిష్యత్ నాయకత్వం, పాలన, పరిశ్రమలు, సాంకేతికత వంటి అంశాలపై శిక్షణ, పరిశోధన, అంతర్జాతీయ భాగస్వామ్య కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. ఇది అమరావతికి మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపుగా నిలవొచ్చని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పుడు సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పెట్టుబడిదారులకు మరింత దగ్గర చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖను అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా, అమరావతిని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దే దిశగా ఈ సదస్సు ఒక కీలక అడుగుగా మారే అవకాశం కనిపిస్తోంది. సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ను ప్రభుత్వం కేవలం రెండు రోజుల కార్యక్రమంగా కాకుండా, రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే వేదికగా మలచాలని ప్రయత్నిస్తోంది. పెట్టుబడులు, వ్యాపార ఒప్పందాలు, సాంకేతిక సహకారం, ప్రపంచ స్థాయి ఆలోచనలు, విద్యా సంస్థల భాగస్వామ్యం, భవిష్యత్ రంగాలపై చర్చలు... ఇలా అన్ని కోణాల్లో ఈ సదస్సు విజయవంతమైతే, ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ ఆర్థిక పటంలో మరింత బలమైన గుర్తింపు తీసుకురావడంలో ఇది కీలక మైలురాయిగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.
0 Comments