ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం అయిన ఘటనపై ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇందుకోసం జగన్ తన గొడ్డలి పార్టీ కార్యకర్తలను రంగంలోకి దింపారని లోకేశ్ ఆరోపించారు. నంద్యాలలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడు జమ్ములయ్య వైఎస్సార్సీపీ నేతల ముఖ్య అనుచరుడని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారని మంత్రి పేర్కొన్నారు. తమ పార్టీ నేతలే విగ్రహాలను ధ్వంసం చేయించి, ఆ నెపాన్ని ప్రభుత్వంపై నెట్టేందుకు క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.
0 Comments